బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బహనాగా స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్లు వేర్వేరు మృతుల సంఖ్య(Death Toll)ను వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 500 దాటినట్లు తనకు సమాచారం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అయితే ఆ సమయంలో అక్కడ దీదీ పక్కన నిలుచున్న రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ జోక్యం చేసుకుని, ఒడిశా ప్రభుత్వ డేటా ప్రకారం కేవలం 238 మంది మరణించినట్లు వెల్లడించారు.
రైల్వే మంత్రి వైష్ణవ్ జోక్యం చేసుకున్న తర్వాత మమతా బెనర్జీ మళ్లీ జోక్యం చేసుకుని శుక్రవారం రాత్రి వరకే 238 మంది మరణించినట్లు ఆమె చెప్పారు. ఇంకా మూడు కోచ్ల్లో రెస్క్యూ పని పూర్తి కాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. యాంటీ కొలిజిన్ కవచ్ వ్యవస్థ ఆ రెండు రైళ్లలో లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం.. ఒడిశా రైలు ప్రమాదంలో 261 మంది మృతిచెందారు. 900 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని గోపాల్పుర్, ఖాంతాపుర, బాలాసోర్, భద్రక్, సోరో, కటక్ ఆస్పత్రుల్లో చేర్పించారు.