కోల్కతా, మార్చి 21: దేశంలో అతి పెద్ద చొరబాటుదారుడు ప్రధాని మోదీయేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కోల్కతాలో శనివారం జరిగిన ఈద్ ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ.. ‘దేశంలో అతిపెద్ద చొరబాటుదారుడు మోదీ. బెంగాల్ను ఎవరు లక్ష్యంగా చేసుకుంటారో వారు నరకానికి వెళ్తారు. బీజేపీని రాష్ట్రంలోకి రాకుండా చూస్తాం. మోదీ నుంచి బీజేపీ నుంచి బెంగాల్ను కాపాడటమే తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యం. బీజేపీ అంటే గూండాలు, దొంగల పార్టీ. మీ ఓటు హక్కును మోదీ తీసుకోకుండా చూస్తా. అన్ని కులాలు, వర్గాల ప్రజలకు అండగా ఉంటా’ అని తెలిపారు. మమత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశ, భయంతో మమత ఇలా ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేత శిశిర్ బజోరియా అన్నారు. ప్రధాని మోదీని చొరబాటుదారుడు అని ఎవరు అన్నా వారికి రాజ్యాంగ పదవిలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు.