అధికార తృణమూల్లో అంతర్గతంగా కలహాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది. సీనియర్లు వ్యవహరిస్తున్న తీరు, బాసిజం జూనియర్లకు ఏమాత్రం నచ్చడం లేదన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలా నడుస్తుండగానే.. జూనియర్లు సోషల్ మీడియా వేదికగా ఓ ఉద్యమాన్నే లేవదేశారు. ఒకే వ్యక్తి- ఒకే పదవి అన్న నినాదంతో ఓ ఉద్యమాన్నే లేపడంతో వ్యవహారం ముదిరిపోయింది. దీంతో మమతా బెనర్జీ అలర్ట్ అయ్యారు. శనివారం సాయంత్రం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.
అయితే కేవలం సీనియర్లకు మాత్రమే మమతా బెనర్జీ ఆహ్వానం పంపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, సెక్రెటరీ జనరల్ పార్థా ఛటర్జీ, బెంగాల్ పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షీ, మంత్రులు ఫిర్హద్ హకీమ్, అరూప్ విశ్వాస్, చంద్రిమా భట్టాచార్య మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ‘ఈ అత్యవసర సమావేశం శనివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై లోతుగా చర్చిస్తుంది. ఒకరినొకరు విభేదించుకోవడం అధ్యక్షురాలు మమతకు నచ్చడం లేదు. వీటికి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం వేదికగా మా నాయకురాలు ఓ మెసేజ్ ఇవ్వనున్నారు’ అని ఓ సీనియర్ నేత తెలిపారు.