న్యూఢిల్లీ: పిజ్జాలు, బర్గర్లు, స్మార్ట్ఫోన్లు, వస్ర్తాలు ఇంటింటికీ డెలివరీ చేయగలుగుతున్నప్పుడు, రేషన్ సరుకులను ఎందుకు చేయలేమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంటింటికీ రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు తాము తీసుకొచ్చిన ‘డోర్స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్’కి కేంద్రం ఎందుకు మోకాలడ్డుతున్నదని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసం వెంటనే ఈ పథకానికి ఆమోదం తెలుపాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో రేషన్ దుకాణాలు వైరస్ ‘సూపర్-స్ప్రెడర్లు’గా మారే ప్రమాదం ఉన్నదని, కాబట్టి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని రేషన్ మాఫియా ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని నిలిపేశారా? అని ప్రశ్నించారు. కేంద్రం రేషన్ మాఫియాకు అండగా నిలబడితే, పేదల పక్షాన ఎవరుంటారన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈ పథకాన్ని తీసుకురాలేదన్నారు. కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ‘డోర్స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్’ పేరుతో ఆమ్ఆద్మీ పార్టీ పెద్ద కుంభకోణానికి తెరతీసిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. రాయితీలో వచ్చిన ఆహార ధాన్యాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ పథకం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కుట్రకు తెరతీసేందుకే పథకాన్ని నిలిపేసినట్టు వెల్లడించారు.