సర్కోలీ: మహారాష్ట్రలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం పండరీపూర్లో శ్రీవిట్టల్ రుక్మిణీ ఆలయ సందర్శన అనంతరం సర్కోలీ గ్రామానికి చేరుకున్నారు. సర్కోలీ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు భగీరత్ బాల్కే ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు. సర్కోలీలో బీఆర్ఎస్ శ్రేణులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం కేసీఆర్ శక్తిపీఠం తుల్జాపూర్ భవానీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కాగా, సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. రాత్రి సోలాపూర్లో బస చేసి.. ఇవాళ ఉదయం పండరీపూర్ చేరుకున్నారు.