ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు పోస్టుకార్డు ఉద్యమమే సరైన మార్గమని వక్తలు అభిప్రాయపడ్డారు. డయల్ యువర్ విలేజ్, పీపుల్స్పల్స్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ సీనియర్ జర్నలిస్టు, పీపుల్స్పల్స్ ప్రతినిధి దిలీప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందన్నారు.
– ఖైరతాబాద్, ఆగస్టు 18
విద్యా వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. రాష్ట్రంలో 63 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ సెక్టార్ లో చదువుతుండగా, కేవలం 37 శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కస్తూర్బా పాఠశాలల్లో 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులకు హాస్టల్ వసతులతో కూడిన విద్య అందుతోందని, అయితే హాస్టల్ సదుపాయం లేని డే సూళ్లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తగినన్ని తరగతి గదులు, బెంచీలు, తాగునీరు మౌలిక వసతులు అందుబాటులో లేవన్నారు.
ఉపాధ్యాయుల కొరత కూడా విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. విద్యార్థినులకు పాఠశాలల్లో మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడం తీవ్ర సమస్యగా మారిందన్నారు. టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది బాలికలు రోజంతా నీళ్లు తాగకుండా ఉంటున్నారన్నారు. దీంతో విద్యార్థినులు తీవ్రమైన యూరినరి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు గురై అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ‘అసర్’ నివేదిక ప్రకారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థి 4వ తరగతి స్థాయి లెకలు చేయలేకపోతున్నాడని, 9వ తరగతి విద్యార్థి 5వ తరగతి తెలుగు పుస్తకాన్ని చదవలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ప్రాథమిక, సెకండరీ, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్యలతో కలిపి విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్ లో కేవలం 8 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులను కనీసం 15 శాతానికి పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్ లు, లైబ్రరీలు, క్రీడా ప్రాంగణాలు కల్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలన్నారు. ప్రభుత్వ బడుల్లోని దయనీయ పరిస్థితులను నేరుగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడమే ఈ పోస్ట్కార్డ్ ఉద్యమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.
విద్యార్థులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయించి పంపిస్తున్నామని, మొత్తం 20 వేల లేఖలను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి 12 వేలకుపైగా లేఖలు హైకోర్టుకు చేరుకున్నాయని చెప్పారు. హైకోర్టు ఈ లేఖలపై సుమోటోగా స్పందించకపోతే, విద్యార్థులు పంపిన లేఖలను ఆధారంగా చేసుకుని తామే స్వయంగా ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
డయల్ యువర్ విలేజ్ ప్రతినిధి రవిప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదురొంటున్న సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో, వారి సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పోస్ట్ కార్డు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలను మెరుగుపర్చకుండా 27వేల పాఠశాలలను 4వేలకు కుదిస్తామని చెప్పడం సరికాదన్నారు. సమావేశంలో న్యాయవాది సుమంత్, ఫొటో జర్నలిస్టు, రచయిత కందుకూరి రమేశ్, డయల్ యువర్ విలేజ్ప రతినిధి మహిపాల్, సురేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.