ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంబై పర్యటన విజయవంతంగా ముగిసింది. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో వేర్వేరుగా సీఎం కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ రెండు సమావేశాల్లోనూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా.. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వర్ష బంగ్లాకు తన బృందంతో వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి కేసీఆర్ బృందం లంచ్ చేసింది. అనంతరం ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్ కలిసి దేశ రాజకీయాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా, శరద్ పవార్ ఇంటికి వెళ్లారు.
అక్కడ శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, సుప్రియా సులేతో కేసీఆర్ సమావేశమై గంటన్నర పాటు జాతీయ రాజకీయాలపై చర్చించారు. శరద్ పవార్తో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ ముంబై ఎయిర్పోర్టుకు బయల్దేరి, హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.