ప్రధాన దవాఖానల్లో ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు
మహిళా సంఘాలకు త్వరలో పావలా వడ్డీకే రుణాలు
వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట
రైతులు సాగుచేసిన ప్రతి గింజనూ కొంటాం..
ఆయిల్ పామ్, విత్తనోత్పత్తి సాగును ప్రోత్సహిస్తాం
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి
సిద్దిపేట జోన్/ గజ్వేల్ అర్బన్/ గజ్వేల్ రూరల్ (మార్చి 21):పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నామని, ప్రధాన దవాఖానల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గజ్వేల్ ఏఎంసీలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీ రుణాలు అందిస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టామన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్, విత్తనోత్పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఆయిల్ పామ్ సాగుకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామని, ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
సిద్దిపేట జోన్ (మార్చి 21) : మహిళా సంఘాల బలోపేతానికి పావలా వడ్డీ రుణాల చెల్లింపు కోసం సీఎం కేసీఆర్ ముందుకొచ్చి బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణ 103 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.6.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు-వడ్డీలేని రుణ మంజూరు ధ్రువపత్రాలు పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్లో మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అంతకు ముందు ఎస్సీ కార్పొరేషన్ కింద ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పనకు రుణ చెక్కులు అందజేశారు. ఈ మేరకు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పత్రాలతో పాటు ఇంటింటా మొక్కలు నాటి పెంచాలని మంత్రి స్వయంగా మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పావలా వడ్డీకి 4 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 7 శాతం భరించాల్సి ఉన్నదని, కానీ.. కేంద్రం తమ వాటాను నిలిపివేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులపై సీఎం కేసీఆర్ ప్రేమతో పూర్తి వాటాను, అంటే కేంద్ర 4 శాతం, రాష్ట్ర 7 శాతం మొత్తం 11 శాతాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు.
భారమైనప్పటికీ మహిళా సంఘాలకు ఇచ్చిన వాటా మేరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, ఇందుకు అనుగుణంగానే బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి రెండు స్కోచ్ అవార్డులు రావడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్ -2021 అవార్డును సాధించేలా స్వచ్ఛ సర్వేక్షణ్ పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి సిద్దిపేట మున్సిపాలిటీని దేశంలోనే ఆదర్శ పట్టణంగా మార్చుకుందామని కోరారు. కోమటి చెరువుపై మరో రెండు వినూత్న ప్రక్రియలకు నాంది పలికామని, రూ.3 కోట్లతో గ్లో గార్డెన్, రూ.3.50 కోట్లతో మ్యూజికల్ పౌంటెయిన్ ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రంగనాయకసాగర్ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామమని మంత్రి తెలిపారు.
మహిళా సంఘాలకు త్వరలో పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని మంత్రి తెలిపారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయిల్ పామ్, విత్తనోత్పత్తి సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పేదింటి ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సాయం చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో ఆదివారం నియోజకవర్గ పరిధిలోని అబ్ధిదారుకలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్పటేల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.