ముంబై: అనూహ్యంగా గురువారం రాత్రి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే అనంతరం రెబల్ ఎమ్మెల్యేలు క్యాంప్ చేసిన గోవాలోని హోటల్కు తిరిగి వెళ్లారు. మంత్రి వర్గం కూర్పు గురించి వారితో చర్చించారు. అయితే సీఎం షిండే శుక్రవారం తిరిగి ముంబైకి చేరుకున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యే, షిండే వర్గం అధికార ప్రతినిధి దీపక్ కేసర్కార్ ఈ విషయం తెలిపారు. ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో షిండే తిరిగి ముంబైకి వెళ్లారని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సమావేశమవుతారని అన్నారు. షిండేను గోవా టూరిస్ట్గా తమ ప్రత్యర్థులు పేర్కొన్నడాన్ని ఆయన తప్పుపట్టారు.
మరోవైపు సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ మధ్య సమన్వయం గురించి దీపక్ కేసర్కార్ మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి అయినా పని చేసే ముఖ్యమంత్రి ఉన్నారు. మాజీ సీఎంగా ఉండి డిప్యూటీ సీఎం ఎలా అయ్యారని ఆశ్చర్యపోని ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. వీరిద్దరికీ అంత పరిజ్ఞానం, దృఢ సంకల్పం ఉంది. వారు కలిసి వస్తే మహారాష్ట్రను మార్చగలరు’ అని అన్నారు.
కాగా, షిండే వర్గం రెబల్ ఎమ్మెల్యేలు ఇంకా గోవాలోని హోటల్లో ఉన్నారు. అయితే సీఎం ఏక్నాథ్ షిండే జూలై 4న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూలై 3, 4న మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది.