manipur| ఇంఫాల్: పొరుగురాష్ట్రం మిజోరంపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ మండిపడ్డారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగాను హెచ్చరించారు. మణిపూర్ హింసతో తీవ్రంగా ప్రభావితమైన కుకీ వర్గానికి సంఘీభావంగా మిజోరంలో ర్యాలీ నిర్వహించారు. దీనికి సీఎం జోరం తంగా హాజరయ్యారు. దీనిపై బీరెన్సింగ్ స్పందిస్తూ.. తాము ఎవరికీ భయపడబోమని, అక్రమ చొరబాటుదారులను రాష్ట్రం నుంచి తరిమేస్తామని స్పష్టం చేశారు. కుకీ తెగకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. డ్రగ్ ముఠాపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాతే సమస్య మొదలైందని సీఎం చెప్పారు.
కుకీ, మీతీ తెగల మధ్య ఘర్షణతో దాదాపు మూడు నెలలుగా మణిపూర్ అట్టుకుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని పార్లమెంట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్లో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 13 వేల మంది కుకీ వర్గ ప్రజలు మిజోరంలో తలదాచుకుంటున్నారు.