Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఫతేఘఢ్ సాహిబ్లోని గురుద్వారాలో ప్రత్యేక పూజలు చేశారు. గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్, మాతా గుజ్రీ జీలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. గురు గ్రంథ్ సాహిబ్ ముందు రుమాలా సాహిబ్ను సీఎం భగవంత్ మాన్ అర్పించారు. మాతా గుజ్రీ జీ, చోటే సాహిబ్జాదేలు బాబా జోరావర్ సింగ్ జీ, బాబా ఫతే సింగ్ జీ అత్యున్నత త్యాగాలకు తలవంచి నమస్కరించాడు. ఈ ప్రత్యేక పూజల్లో మాన్ సతీమణి కూడా పాల్గొన్నారు. ఫతేగఢ్ సాహిబ్ వార్షిక జుడ్ ఫెయిర్లో సీఎం భగవంత్ మాన్ తన కుటుంబంతో కలిసి గురువు పాదాలకు నమస్కరించారు.
అనంతరం ఫతేఘఢ్ సాహిబ్ గురుద్వారా ఆవల సీఎం మాన్ మీడియాతో మాట్లాడారు. త్యాగానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఈ ప్రపంచంలోనే లేదన్నారు. గురుగోవింద్ సింగ్ జీ సత్య మార్గంలో నడుస్తూ తన కుటుంబాన్ని సమర్పించారని కొనియాడారు. సత్యం కోసం నాయకులు ఎప్పుడూ తమ గొంతును పెంచాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఈ సమయంలో ఎమ్మెల్యే లఖ్వీర్ సింగ్ రాయ్, ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ హ్యాపీ, ఎమ్మెల్యే గ్యారీ వాడింగ్ కూడా సీఎం మాన్తో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పంజాబ్ ఆప్ ప్రభుత్వం తన ట్విట్టర్ హ్యాండిల్లో సీఎం భగవంత్ మాన్ ప్రత్యేక ప్రార్థనల ఫొటోలను షేర్ చేసింది. చోటే సాహిబ్జాదే, మాతా గుజ్రాజీ కౌర్ అమరవీరత్వానికి అంకితమయ్యారని కాప్షన్ రాశారు.