మంత్రి కె.ఎస్. ఈశ్వరప్పను కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెనకేసుకొచ్చారు. ఎప్పటికైనా ఎర్రకోటపై కాషాయ జెండా ఎగిరితీరుతుందన్న మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూ లేదన్నారు. ఆయన వ్యాఖ్యల్లో పూర్తి స్పష్టత వుందన్నారు. ఇప్పటికిప్పుడే ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందని ఆయన అనలేదని, కాకపోతే మరో 500 సంవత్సరాలకైనా ఎర్రకోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని మాత్రమే అన్నారని సీఎం పేర్కొన్నారు. అయితే ఇలా జరగనైనా జరగొచ్చు, జరగకపోవచ్చు కూడా అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను అనవసరంగా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయని, లేనిపోని ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
ఈశ్వరప్ప ఏమన్నారంటే..
కాషాయ జెండా ఎప్పటికైనా జాతీయ జెండాగా మారే అవకాశాలున్నాయని మంత్రి ఈశ్వరప్ప అన్నారు. ప్రస్తుతం మాత్రం త్రివర్ణ పతాకమే జాతీయ జెండా అని, దానిని అందరూ గౌరవించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు తాము అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపడతామంటే అందరూ నవ్వేవారని, ఇప్పుడు రామ మందిర నిర్మాణం చేపడుతున్నామా? లేదా? అచ్చు ఇలాగే.. 100 సంవత్సరాలకో, 500 సంవత్సరాలకో కాషాయ జెండా కచ్చితంగా జాతీయ జెండాగా మారుతుందన్నారు. గతంలో శ్రీరాముడు, హనుమంతుడి రథాలపై కాషాయ జెండాయే ఉండేదని, అప్పుడు త్రివర్ణ పతాకం ఉందా? అంటూ ప్రశ్నించారు.