న్యూఢిల్లీ, ఆగస్టు 7: లైంగిక దాడి బాధితురాళ్ల హత్యలకు కారణం చట్టమేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. నిందితులకు మరణ శిక్ష విధిస్తూ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచే హత్యలు పెరిగాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అధిక ధరలు, నిరుద్యోగం విషయంలో కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహించిన నిరసన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నిర్భయ ఘటన తర్వాత రేపిస్టును ఉరి తీయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో సంబంధిత చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచే మహిళలపై లైంగిక దాడికి పాల్పడి హత్యలు చేస్తున్నారు. ఇది దేశంలో ప్రమాదకరమైన ధోరణికి దారితీస్తున్నది’ అని పేర్కొన్నారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.