న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచి పాలన మొదలుపెట్టారు. అరెస్టయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారు. జల మంత్రిత్వ శాఖకు నోట్ ద్వారా ఆదేశించారని పార్టీ వర్గాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిశి ఆదివారం నిర్వహించనున్న మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
కాగా, లిక్కర్ పాలసీ కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనకు మార్చి 29 వరకు కస్టడీ విధించింది. అయితే కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచి అవసరమైతే తమ నాయకుడు జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆప్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని తాము ఇప్పటికే చెప్పామని మంత్రి అతిశి అన్నారు. జైలు నుంచి పాలన సాగించడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆయన దోషిగా నిర్ధారణ కాలేదని, అందువల్ల ఆయన ఢిల్లీ సీఎంగానే కొనసాగుతారని చెప్పారు.