న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: భారత్లో త్వరలోనే ‘ఇండియాసైజ్’లో దుస్తులు లభించనున్నాయి. ఇందుకోసం కేంద్ర టెక్స్టైల్స్ శాఖ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ విషయాన్ని గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. ఇప్పటివరకు భారత్లో దుస్తులు అన్నీ యూఎస్ లేదా యూకే సైజ్లలోనే లభిస్తున్నాయి. అక్కడి ప్రజల శరీరాలను ప్రామాణికంగా తీసుకొని రూపొందించిన కొలతలు ఇవి. ఈ దుస్తులు భారతీయులు ధరించేటప్పుడు కొన్నిసార్లు సరిగ్గా సరిపోవు. పాశ్చాత్యుల శరీర కొలతలు భారతీయులతో పోలిస్తే కొంత భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ సమస్యకు ‘ఇండియా సైజ్’ ప్రాజెక్టు పరిష్కారం చూపిస్తుందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. భారతీయుల శరీరాలకు తగ్గట్టుగా కొత్త ప్రామాణిక కొలతలను రూపొందించనున్నట్టు ఆయన చెప్పారు. కాగా,దుస్తుల డిజైన్ల తయారీ కోసం టెక్స్టైల్స్ శాఖ, ఎన్ఐఎఫ్టీ కలిసి రూపొందించిన ఏఐ ఆధారిత ‘విజన్నెక్ట్స్’ పోర్టల్ను గురువారం గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు.