లక్నో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో గొరఖ్పూర్లోని బహ్రాంపూర్కు చెందిన బాలిక ప్రతి రోజు పడవను నడుపుతూ స్కూలుకు వెళ్తున్నది. విద్యార్థిని సంధ్య సహానీ 11వ తరగతి చదువుతున్నది. పేద కుటుంబానికి చెందిన తన వద్ద స్మార్ట్ఫోన్ లేదని, దీంతో ఆన్లైన్ క్లాసులకు హాజరుకాలేక పోయానని ఆమె చెప్పింది.
మరోవైపు ప్రస్తుతం స్కూళ్లు తెరువగా తమ ప్రాంతం వరదమయమైందని సంధ్య తెలిపింది. దీంతో తరగతులకు హాజరయ్యేందుకు పడవపై స్కూలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. కాగా, వరదల్లోనూ సాహసం చేసి పడవ నడుపుతూ స్కూలుకు వెళ్తున్న ఆ బాలిక పట్టుదల, చదువు పట్ల ఆమె శ్రద్ధను పలువురు ప్రశంసించారు.