CBSE | సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న 10వ, 12వ తరగతి పరీక్షల డేట్ల షెడ్యూల్పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అధికారులు రియాక్టయ్యారు. సోషల్ మీడియాలోని డేట్ షీట్లు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. తాము ఇంకా పదో తరగతి, 12వ తరగతి పరీక్షల తేదీలు ప్రకటించలేదని తేల్చి చెప్పారు. త్వరలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
`సోషల్ మీడియాలో విభిన్న వర్షన్లలో హల్చల్ చేస్తున్న పదోతరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ డేట్ షీట్లు ఫేక్. త్వరలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తాం. అధికారికంగా తాము షెడ్యూల్ విడుదల చేసే వరకు వేచి ఉండాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల`కు సీబీఎస్ఈ అధికారి ఒకరు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి పదవ, 12వ తరగతి విద్యార్థులకు థియరీ పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ గతంలోనే ప్రకటించినా.. సబ్జెక్టుల వారీ షెడ్యూల్ వెల్లడించలేదు.
2023 జనవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలవుతాయని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. వీటికి సంబంధించిన సిలబస్ పూర్తి చేయాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించామన్నారు. 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు సీబీఎస్ఈ నియమించిన ఎగ్జామినర్లు మాత్రమే చేపడతారని పేర్కొన్నారు. 10వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం ఇంటర్నల్ ఎగ్జామినర్లు నిర్వహిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీబీఎస్ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని తెలిపారు.