న్యూఢిల్లీ, జనవరి 6: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన తమిళనాడు మంత్రి వీ సెంథిల్బాలాజీని క్యాబినెట్ నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి ప్రతిపాదన లేకుండా ఓ మంత్రిని గవర్నర్ తొలగించడం సాధ్యం కాదని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం మౌఖికంగా తేల్చి చెప్పింది.
డీఎంకే మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించాలన్న పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో దానిలో తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. క్యాబినెట్లో మంత్రి బాలాజీ కొనసాగాలా? వద్దా? అనేది మఖ్యమంత్రి నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు వదిలివేయడాన్ని న్యాయవాది ఎంఎల్ రవి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఈ పిటిషన్ను కొట్టివేసింది. 2011-15 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేసిన సెంథిల్బాలాజీ ‘క్యాష్ ఫర్ జాబ్స్’ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2021 డీఎంకేలో చేరిన ఆయనను ఈడీ గతేడాది అరెస్ట్ చేసింది.