రాంచీ, జూలై 23: తలపండిన న్యాయమూర్తులు సైతం న్యాయాన్యాయాలు తేల్చడానికి బుర్ర బద్దలు కొట్టుకొనే వ్యవహారాలపై సైతం మీడియా సంస్థలు అక్రమ కోర్టులు నిర్వహిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాంచీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యాయనిర్ణయాలకు సంబంధించిన అంశాలపై తెలిసీ తెలియని తనంతో, సొంత ఎజెండాతో చర్చలు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చి వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారుతున్నదని పేర్కొన్నారు. న్యాయనిర్వహణ తీవ్రంగా దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అతి స్పందనతో, బాధ్యతలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని వెనుక్కు నడిపిస్తున్నదని అన్నారు. ప్రింట్ మీడియా లో ఇంకా కొంత జవాబుదారి మిగిలే ఉన్నదని, ఎలక్ట్రానిక్ మీడియా చూపించే దృశ్యాలు గాలిలో కలుస్తున్నందున జవాబుదారీ సున్నాకు పడిపోయిందని చెప్పారు.
సోషల్ మీడియా అయితే మరీ దారుణమని అన్నారు. ‘మీడియా స్వీయ నియంత్రణను పాటిస్తూ మాటలను ఆచితూచి వినియోగించాలి. హద్దు మీరి ప్రభుత్వ లేదా న్యాయసంస్థల జోక్యాన్ని ఆహ్వానించవద్దు. స్వేచ్ఛలను తమతమ పరిధుల్లో బాధ్యతాయుతంగా వినియోగించుకొంటే హేతుబద్ధమైన లేదా తగిన నియంత్రణలను బయటి నుంచి ప్రయోగించాల్సిన అగత్యం ఉండదు’ అని హితవు చెప్పారు. న్యాయమూర్తులపై భౌతిక దాడులు పెరగడాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయ నాయకులు, ప్రభుత్వ, పోలీసు అధికారులు వారి సున్నిత బాధ్యతల కారణంగా పదవీ విరమణ అనంతరం కూడా భద్రత కల్పిస్తారని అన్నారు. న్యాయమూర్తులకు మాత్రం అలాంటి భద్రత కల్పించడం లేదని గుర్తు చేశారు. ‘ఈ రోజుల్లో న్యాయమూర్తులపై దాడులు పెరగడం చూస్తున్నాం. న్యాయమూర్తులు తాము దోషులుగా తేల్చి, శిక్షలు వేసిన వ్యక్తులు ఉన్న సమాజంలోనే ఎలాంటి భద్రత లేకుండా జీవించాల్సి వస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. తీర్పుల ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం పెద్ద సవాలుగా తయారైందని అన్నారు. ‘సామాజిక వాస్తవికతల నుండి న్యాయమూర్తులు ముఖం తిప్పుకోవడం కుదరదు. వ్యవస్థను నివారించదగ్గ ఘర్షణల నుంచి, భారాల నుంచి కాపాడాలంటే తక్షణ సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు’ అని చెప్పారు. న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడం, సౌకర్యాలను మెరుగుపర్చకపోవడం పెండింగ్ కేసులకు ప్రధాన కారణాలని జస్టిస్ రమణ స్పష్టం చేశారు.