న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఢిల్లీ, దేశ రాజధాని పరిధి (ఎన్సీఆర్)లో కాలుష్య నియంత్రణకు గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ మార్గదర్శకాలను తప్పక అమలు చేయాలని ఢిల్లీ, కేంద్రప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ వాయుకాలుష్యంపై శుక్రవారం విచారణను కొనసాగించింది. కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సుప్రీంకోర్టుకు ప్యానెల్ అఫిడవిట్ను సమర్పించింది. పరిస్థితులు మెరుగుపడేంత వరకు ఢిల్లీలో బడులను మూసివేయాలని సూచించింది. ఎన్సీఆర్లోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించింది. పరిశ్రమలు వారంలో ఐదు రోజులే అది కూడా రోజుకు 8 గంటలే పనిచేయాలని, వారాంతాల్లో మూసివేయాలని సిఫారసు చేసింది. డీజిల్ జనరేటర్లపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరింది. కాలుష్య నివారణకు ఐదుగురు సభ్యులతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని, నివారణ చర్యల అమలు పర్యవేక్షణకు 40 బృందాలను నియమించాలని సిఫారసు చేసింది. కాగా, ఢిల్లీలో బడులు తెరవడంపై కొన్ని చానళ్లు తమను విలన్గా చిత్రీకరించాయని కోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్య నివారణపై విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.