Justice NV Ramana For Academy | జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదలకు నూతన సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్జేఐఏఐ) ను ఏర్పాటు చేయాలని సీజేఐ నుంచి తమకు ప్రతిపాదన వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు.
దేశవ్యాప్తంగా కోర్టుల్లో సరైన మౌలిక వసతులను కల్పించే బాధ్యతను ఎన్జేఐఏఐ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రతిపాదన ప్రకారం సదరు సంస్థకు సీజేఐ ప్యాట్రన్ ఇన్ఛీఫ్గా వ్యవహరిస్తారు. దేశంలోని 25 రాష్ట్రాల హైకోర్టుల పరిధిలోని భారతీయ కోర్టు వ్యవస్థ నిర్వహణ, ఫంక్షనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు కార్యాచరణ ప్రణాళికను ఈ సంస్థ రూపొందిస్తుంది. ప్రస్తుతం జ్యుడీషియరీ విభాగంలో మౌలిక వసతులను కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రాష్ట్ర ప్రభుత్వాలకు వనరులను పెంపొందించడానికి జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఓ పథకాన్ని అమలు చేస్తున్నది.
నిర్దిష్ట నిష్పత్తితో కూడిన నిధుల వాటా కింద కోర్టుల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. 1993-94 నుంచి అమలవుతున్న ఈ పథకానికి కేంద్రం రూ.8709.77 కోట్లు మంజూరు చేసింది. నాటి నుంచి సమయానుకూలంగా ఈ పథకాన్ని పొడిగిస్తూ వచ్చింది. తాజాగా దీన్ని 2026 మార్చి వరకు పొడిగించినట్లు కిరెన్ రిజిజు చెప్పారు. మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ.9000 కోట్లయితే, ఇందులో కేంద్రం వాటా రూ.5,307 కోట్లు అని తెలిపారు. ఈ నిధులతో జిల్లా, సబార్డినేట్ కోర్టులు, జడ్జిలకు నివాస గృహాలు నిర్మిస్తారు.