CJI DY Chandrachud | ముంబై, డిసెంబర్ 8: దేశంలో న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఖాళీలు భారీగా పెరిగిపోతున్నప్పటికీ, నియామకాలు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంటున్నప్పటికీ, ఈ నియామకాల్లో అంతిమంగా ఎవరి నియంత్రణ ఉండాలనే విషయంలో నిరంతర పోట్లాట జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (సీఏటీ) ముంబై బెంచ్కు నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. కోర్టుల్లో కేసుల విచారణలో జాప్యాన్ని నివారించడంలో, న్యాయ సేవలు అందించడంలో ట్రైబ్యునళ్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులు కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య తరచూ వివాదం నడుస్తున్నది.
భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక న్యాయమూర్తిగా తాను చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడినని, తనకు నిర్దేశించిన స్థాయిని అనుసరించాల్సి ఉందని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావులేదని అన్నారు. రోజువారీ కార్యకలాపాలలో భాగంగా సీజేఐ నేతృత్వంలోని జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆసీనులైనప్పుడు న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపర ఒక అంశాన్ని ప్రస్తావించగా చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొలీజియం వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, సీనియర్ న్యాయవాది హోదాను రద్దు చేయాలని మాథ్యూస్ ధర్మాసనాన్ని కోరారు. ‘మీ మనస్సాక్షి చెప్పిన విధంగా స్వేచ్ఛగా వ్యవహరించే హక్కు మీకుంది. అయితే భారత ప్రధాన న్యాయమూర్తిగా, మరీ ముఖ్యంగా ఒక న్యాయమూర్తిగా తొలుత నేను చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడిని’ అని చంద్రచూడ్ పేర్కొన్నారు. ‘నాకు నిర్దేశించిన స్థాయిని నేను అనుసరించాలి. నాకిదే ఇష్టం.. నేనిదే చేస్తాను అని చెప్పలేను’ అని ఆయన అన్నారు.