న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రితో వాదనలకు దిగాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. శనివారం ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు. జడ్జిల నియామకంలో సుప్రీం కొలీజియం పంపిన సిఫార్సులను ఆమోదించకపోవడానికి కేంద్రం చెప్పిన కారణాలను కొలీజియం బయటకు వెల్లడించడంపై ఇటీవల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ ‘ఏదైనా అంశంపై ఎవరైనా భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అందులో తప్పేముంది? నేనైతే అలాంటి అభిప్రాయాలను రాజనీతిజ్ఞతతో చేసిన ప్రకటనగా భావిస్తా. ఈ విషయంలో ఆయనతో నేనేమీ చర్చలకు, వాదోపవాదాలకు దిగను. ఎందుకంటే ఇద్దరం విభిన్న ఆలోచన ధోరణులకు కట్టుబడి ఉన్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే బయటి నుంచి వచ్చే ఒత్తిళ్ల నుంచి రక్షణ లభించాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో మనం అభివృద్ధి చేసిన ప్రతి వ్యవస్థ పరిపూర్ణమైనది కాదని, అయితే జడ్జిల నియామకంలో ఉన్న కొలీజియం వ్యవస్థ మాత్రం సమర్థతతో ఉన్నదని వివరించారు. కేసులకు సంబంధించి తమపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని, ఇందుకు ఎన్నికల సంఘంపై తాము ఇచ్చిన తీర్పే నిదర్శనమన్నారు.