హైదరాబాద్ : తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం ప్రకటించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు అని తెలిసి ఎంతో విచారించానన్నారు. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదిందన్నారు. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో.. తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు. సాహితీ విరించి సీతారామశాస్త్రికి శ్రద్ధాంజలి ప్రకటించిన ఆయన.. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, లక్షలాది అభిమానులకు సానుభూతిని ప్రకటించారు.