న్యూఢిల్లీ, ఆగస్టు 8: పోలీసుల అదుపులో ఉన్నవారిపై వేధింపులు, చిత్రహింసలు దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగుతున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు ఉన్నవారిపై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆవేదన చెందారు. రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగడం విచారకరమన్నారు. అవసరమైన సమయంలో న్యాయసాయం అందకపోవడం వల్ల పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. మానవ హక్కులపై, ఇందుకు సంబంధించిన చట్టాలపై పోలీసులకు అవగాహన కోసం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (నల్సా) దేశవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టాలని సూచించారు. పేదలకు న్యాయసాయం అందించడం కోసం రూపొందించిన నల్సా మొబైల్ యాప్ను ఆదివారం జస్టిస్ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను పంచుకొన్నారు. సమాజంలో చట్టబద్ధ పాలన సాగాలంటే.. న్యాయసాయం పొందడంలో పేదలకు, ధనికులకు మధ్య ఉన్న అంతరం తొలగిపోవాలన్నారు. న్యాయ వ్యవస్థ, చట్టాలు తమకోసమే ఉన్నాయన్న భావన ప్రజల్లో కలగాలన్నారు. చాలా కాలంగా పేదప్రజలు న్యాయవ్యవస్థకు ఎంతో దూరంగా ఉండిపోయారని పేర్కొన్నారు. గతంలో జరిగిన విషయాలు భవిష్యత్తును నిర్ణయించబోవని, న్యాయ సమానత్వం కోసం ప్రతీ ఒక్కరు పనిచేయాలని నొక్కి చెప్పారు. న్యాయం పొందడంలో రాజ్యాంగపరమైన హక్కులు, న్యాయ సేవల లభ్యతపై ప్రతీ పోలీస్ స్టేషన్లో డిస్ప్లే బోర్డులు పెట్టడం, అవసరమైన వారికి సాయం అందించడం ఈ దిశగా ఒక ముందడుగు అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాలు అంతగా లేకపోవడం వల్ల న్యాయ సహాయానికి అవరోధం ఏర్పడుతున్నదని, ఈ విషయంపై ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి లేఖ రాశానని వెల్లడించారు. బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలు అందించే ఉద్దేశంతో 1987లో లీగర్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం కింద నల్సా తెచ్చారు.
సీజేఐ చీవాట్లతో సీబీఐలో కదలిక
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను, సుప్రీంకోర్టును అగౌరవపర్చేలా సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన ఇద్దరిని సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. జడ్జిల ఫిర్యాదులను సీబీఐ పట్టించుకోవడం లేదని, దాని తీరు మారదా అని జస్టిస్ రమణ ఆక్షేపించిన రెండు రోజుల్లోనే ఈ అరెస్టులు జరగడం విశేషం. జార్ఖండ్లోని సెషన్స్ జడ్జి హత్య కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేసు విషయానికొస్తే… కొందరు జడ్జిలను లక్ష్యంగా చేసుకొని వారిపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టడంపై గతేడాది ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. నవంబర్లో 16 మందిపై కేసు నమోదైంది. మొదటి అరెస్టు జూలైలో జరిగింది. తాజాగా ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసింది.