న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పురుషులు, మహిళలకు వివాహ వయసు విషయంలో ఏకరూపత ఉండేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని, పార్లమెంట్ నిర్ణయం తీసుకొంటుందని వెల్లడించింది. అయితే విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీవ్రంగా మండిపడింది.
‘పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయడంలో అర్థం ఏంటి?’ అని ఉపాధ్యాయ్ కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇక్కడ మేం ఉన్నది రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించేందుకు మాత్రమే కానీ.. మిమ్మల్ని లేదా ఏ రాజకీయ పక్షాన్ని సంతృప్తి పరచడానికి కాదు’ అని పేర్కొన్నది. ఉచిత కామెంట్లు చేయవద్దని గట్టిగా హెచ్చరించింది. ‘ఆర్టికల్ 32ను అపహాస్యం చేయవద్దు. కొన్ని అంశాలు పార్లమెంట్కే రిజర్వ్ చేయబడి ఉంటాయి. వాటిని పార్లమెంట్కే వదిలేయాలి. ఇక్కడ చట్టాలు చేయలేం. రాజ్యాంగానికి ప్రత్యేక సంరక్షుడిగా మనం ప్రత్యేకం అనుకోకూడదు. పార్లమెంట్ కూడా రాజ్యాంగానికి సంరక్షకుడే’ అని సీజేఐ ధర్మాసనం పేర్కొన్నది.