న్యూఢిల్లీ, జనవరి 25: సుప్రీంకోర్టు తీర్పులు ఇకపై తెలుగుతోపాటు షెడ్యూల్డు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్-సుప్రీంకోర్ట్ రిపోర్ట్స్ (ఈ-ఎస్సీఆర్) సర్వీసును సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉచితంగా ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ-ఎస్సీఆర్ (ప్రాజెక్టు)లో దాదాపు 34 వేల తీర్పులు, ప్రాంతీయ భాషల్లో వెలువడిన 1,091 తీర్పులతోపాటు సెర్చింజిన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని లాయర్లకు తెలిపారు.
వీటిలో 28 తెలుగు తీర్పులు, 52 తమిళ, 29 మలయాళ, 21 ఒరియా, 17 కన్నడ, 14 మరాఠీ, 4 అస్సామీ, 4 పంజాబీ, 3 నేపాలీ, 3 ఉర్దూ తీర్పులు ఉన్నట్టు వివరించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధి, తమిళం, బోడో, సంతలి, మైథిలి, డోగ్రీ సహా 22 భాషలు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్నాయి. ఇకపై సుప్రీంకోర్టు తీర్పులను అన్ని షెడ్యూల్డు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.