పూంఛ్, డిసెంబర్ 23: జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో గురువారం ఉగ్ర దాడి జరిగిన ప్రాంతంలో శుక్రవారం ముగ్గురు పౌరులు శవాలై కనిపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని శనివారం ప్రకటించింది. ఉగ్ర దాడి గురించి ఆర్మీ ప్రశ్నించిన ఎనిమిది మందిలో మరణించిన ముగ్గురు పౌరులు ఉన్నారు.
వీరంతా తోపా పీర్ గ్రామానికి చెందినవారు. పౌరుల మరణంపై రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఆర్మీ మొత్తం 15 మందిని ప్రశ్నించిందని.. అందులో ముగ్గురు చనిపోగా మిగతా వారంతా తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీ తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం ఉగ్రవాదులు చేసిన చొరబాటు యత్నాన్ని భారత సైన్యం సమర్థంగా తిపి కొట్టింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.