న్యూఢిల్లీ: నాగాలాండ్లోని (Nagaland) మోన్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి మోన్ జిల్లాలోని ఓటింగ్ ప్రాంతంలో ఉగ్రవాదులనే అనుమానంతో భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపాయి. దీంతో 13 మంది మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఘటనా స్థలంలో ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, కాల్పుల ఘటనపై ఆగ్రహంతో భద్రతా బలగాల వాహనాలను ప్రజలు తగులబెట్టారు.
శనివారం సాయంత్రం ఓటింగ్ ప్రాంతంలో మిలిటెంట్ల కదలికలు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా బొగ్గు గనిలో విధులు ముగించుకుని వెళ్తున్న కార్మికులను మిలిటెంట్లుగా భావించిన జవాన్లు.. వారిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.
కాగా, ఓటింగ్ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో స్పందించారు. కాల్పుల ఘటనను తీవ్రంగా ఖడించారు. దీనిపై విచారణ చేయడానికి తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తున్నానని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అన్నివర్గాల ప్రజలు శాంతించాలని, ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు చట్టపరంగా న్యాయం చేస్తామన్నారు.