అహ్మదాబాద్: విమానాశ్రయానికి చేరుకున్న ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చింది. అతడు కింద పడిపోగా అక్కడే ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాన్ వెంటనే స్పందించాడు. సీపీఆర్ ద్వారా ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగింది. గురువారం ఒక వ్యక్తి విమానంలో ముంబైకి ప్రయాణించేందుకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. సెక్యూరిటీ చెకప్ వద్దకు రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడ కుప్పకూలిపోయాడు.
కాగా, ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ కపిల్ రాఘవ్ వెంటనే స్పందించారు. గుండెపోటు వచ్చిన ఆ వ్యక్తికి సీపీఆర్ చేశారు. మరి కొందరు సీఐఎస్ఎఫ్ జవాన్లు కూడా సహకరించారు. దీంతో ఆ వ్యక్తి కోలుకుని స్పృహలోకి వచ్చాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో గుండెపోటుకు గురైన విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన సీఐఎస్ఎఫ్ జవాన్ను నెటిజన్లు కొనియాడారు. ‘వారు ఎల్లప్పుడూ మానవాళిని రక్షించడం ద్వారా మనం, మన దేశం గర్వించేలా చేస్తారు. ఈ హీరోలకు కృతజ్ఞతలు’ అని ఒకరు ప్రశంసించారు. ప్రపంచంలో అలాంటి వ్యక్తులు మనకు కావాలని మరొకరు పేర్కొన్నారు.
Prompt action of CISF Jawan's saved a life at @ahmairport.
Salute to this great force 🙏 pic.twitter.com/miBP4g8Ft6— Sunil Deodhar (@Sunil_Deodhar) December 22, 2022