న్యూఢిల్లీ: నిఘా డేటా తొలగింపునకు సంబంధించి అఫిడవిట్ను దాఖలు చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను, కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కోరింది. నాలుగు వారాల్లో దీనిని సమర్పించాలని పేర్కొంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రపరిచే నిఘా డేటాకు సంబంధించిన వివరాలను డిజిటల్ హక్కుల సంస్థ అయిన ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ సమాచారం హక్కు చట్టం కింద కోరింది. అయితే దేశ భద్రతకు సంబంధించిన అంశామంటూ డేటా వివరాలు ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. చట్టం ప్రకారం ప్రతి ఆరు నెలలకు నిఘా డేటాను తొలగిస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే ఈ వివరణపై ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ సంతృప్తి చెందలేదు. దీంతో నిఘా డేటా అంశంపై సీఐసీకి అపీల్ చేసింది. ఈ నేపథ్యంలో డేటా తొలగింపునకు సంబంధించి లిఖిత పూర్వకంగా అఫిడవిట్ను సమర్పించాలని కేంద్ర హోంశాఖను సీఐసీ కోరింది. పిటిషనర్ కోరిన సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అన్నది నాన్-జుడిషియల్ స్టాంప్ పేపర్పై అఫిడవిట్గా సమర్పించడం సముచితంగా ఉంటుందని ప్రధాన సమాచార కమిషనర్ వైకే సిన్హా జనవరి 28 నాటి తన ఉత్తర్వులో తెలిపారు. ఈ ఉత్తర్వు అందిన నాలుగు వారాల్లో సంబంధిత అఫిడవిట్ను సమాచార కమిషన్కు అందజేయాలని పేర్కొన్నారు.