కోల్కతా: పాత వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ను కూల్చివేస్తుండగా క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముర్షిదాబాద్ ప్రజా ఆరోగ్య ఇంజినీరింగ్ శాఖ పాత వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ కూల్చివేత పనులు చేపట్టింది. జేసీబీతో పనులు చేస్తుండగా పొరపాటున క్లోరిన్ గ్యాస్ పైప్ పగిలింది. దీంతో క్లోరిన్ గ్యాస్ లీకైంది. ఆ సమయంలో అక్కడ ఉన్న పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడటం లేదని ఆందోళన చెందటంతో వెంటనే 15 మందిని లాల్భాగ్ సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి సీరియస్గా ఉన్న ఇద్దరిని బెర్హంపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.
మరోవైపు సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే సంఘటనా స్థలానికి చేరింది. నీటిని వెదజల్లి క్లోరిన్ గ్యాస్ లీకేజీని అరికట్టింది. జేసీబీ ఆపరేటర్ పొరపాటు వల్ల క్లోరిన్ గ్యాస్ ట్యాంకర్ పైప్ పగిలిందని లాల్భాగ్ ఫైర్ స్టేషన్ ఇంచార్జ్ జితిన్ పాల్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.