న్యూఢిల్లీ, జూన్ 15: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో తలెత్తిన రాజకీయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఎల్జేపీ లోక్సభ పక్షనేతగా చిరాగ్ను కాదని ఆయన చిన్నాన్న, ఎంపీ పశుపతి పరాస్ను ఎన్నుకున్న ఐదుగురు తిరుగుబాటు ఎంపీలు.. మంగళవారం ఏకంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా చిరాగ్కు ఉద్వాసన పలికారు. ఆయనను అధ్యక్ష స్థానం నుంచి తొలగించారు. అంతకుముందు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఐదుగురు ఎంపీలపై చిరాగ్ బహిష్కరణ వేటు వేశారు. పార్టీ ఇచ్చిన నోటీసులకు వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎల్జేపీ వర్గాలు తెలిపాయి. ఇది జరిగిన కొద్ది సేపటికే చిరాగ్ను పార్టీ అధ్యక్షుడి నుంచి తొలగించినట్టు పరాస్ నేతృత్వంలోని వర్గం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడిగా చిరాగ్ను తొలగించిన నేపథ్యంలో పరాస్.. ఎల్జేపీ పార్లమెంటరీ పక్ష నేతతో పాటు పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఉంటారని ఆయన వర్గం తెలిపింది. ఇదిలాఉండగా ఎల్జేపీలో జరుగుతున్న పరిణామాలపై చిరాగ్ పాశ్వాన్ తొలిసారి స్పందించారు. పార్టీ అమ్మలాంటిదని, దానికి ద్రోహం చేయకూడదని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ నెలక్పొలిన పార్టీని, తమ కుటుంబాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నించానని, కానీ విఫలమయ్యానని ట్వీట్లో పేర్కొన్నారు. ఎల్జేపీలో జరుగుతున్న పరిణామాలపై చిరాగ్ బుధవారం మీడియాతో మాట్లాడనున్నారు.