పట్నా : రామ్చరిత్ మానస్పై బిహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్చరిత్ మానస్ను పొటాషియం సైనేడ్తో మంత్రి పోల్చడంపై లోక్జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సమాజంలో విభజన చిచ్చు రేపుతాయని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా చంద్రశేఖర్ హయాంలో రాష్ట్రంలో ప్రాధమిక విద్య పడకేసిందని, విద్యార్ధులకు బెంచ్లు లేవని, మౌలిక వసతులు లోపభూయిష్టంగా ఉన్నాయని దుయ్యబట్టారు. దీనికితోడు ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు సమాజంలో చీలికకు దారితీస్తాయని పాశ్వాన్ పేర్కొన్నారు.
అసలు బిహార్ విద్యార్ధులు రాజస్దాన్లోని కోటాలో ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో విద్యాశాఖ మంత్రి తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. ఇక హిందీ దివస్ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మీకు 55 వంటకాలు వడ్డించి, వాటిలో పొటాషియం సైనేడ్ కలిపితే మీరు తింటారా అని ప్రశ్నిస్తూ హిందూ గ్రంధాలు కూడా ఇంతేనని చంద్రశేఖర్ అన్నారు.
బాబా నాగార్జున్, లోహియా వంటి ఎంతో మంది రచయితలు ఆయా గ్రంధాలను విమర్శించారని పేర్కొన్నారు. రామ్చరిత్మానస్పై తన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నానని, జీవితాంతం ఇదే అభిప్రాయంతో ఉంటానని, ఆరెస్సెస్ చీఫ్ మోఃహన్ భగవత్ సైతం దీనిపై కామెంట్ చేశారని బిహార్ మంత్రి చెప్పారు. కుల వివక్షలో మార్పు రాకుంటే దేశంలో రిజర్వేషన్లు, కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ బిహార్ సీఎం నితీష్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది.
Read More :