చెన్నై: తమిళనాడు ప్రభుత్వం న్యూస్ పేపర్లలో ఇచ్చిన ఇస్రో ప్రకటనలో (Tamil Nadu’s Isro ad) చైనా జెండా కనిపించింది. ఆ రాష్ట్ర బీజేపీ దీనిపై మండిపడింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రెండో లాంచ్ప్యాడ్ను తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మించనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం శంశుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ పలు దినపత్రికల్లో ప్రకటన జారీ చేశారు.
కాగా, తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఈ ప్రకటనలో ఇస్రోకు సంబంధించిన రాకెట్కు చైనా జెండా ఉంది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై దీనిని ఖండించారు. డీఎంకే ప్రభుత్వం దేశ సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచిందని విమర్శించారు. 60 ఏళ్ల కిందట కూడా తొలి లాంచ్ ప్యాడ్ నిర్మాణం కోసం వచ్చిన ప్రతిపాదనపై నాటి డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ప్రస్తుతం కూడా అదే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.