అహ్మదాబాద్: చైనా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్కు పంపారు. బీఎఫ్.7 వేరియంట్ కరోనా చైనాను వణికిస్తున్నది. కొత్త రకం వైరస్ విజృంభణతో ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. పొరుగు దేశమైన చైనా నుంచి కొత్త రకం కరోనా వైరస్ దేశంలో వ్యాపించకుండా పలు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ అధికారులను ఆదేశించారు.
కాగా, గుజరాత్లోని భావ్నగర్కు చెందిన 34 ఏళ్ల బిజినెస్ మ్యాన్ పనుల నిమిత్తం ఇటీవల చైనా వెళ్లాడు. ఈ నెల 19న గుజరాత్కు తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల మేరకు అధికారులు ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం గాంధీనగర్లోని ల్యాబ్కు పంపారు. మరోవైపు దేశంలో ఇప్పటికే బీఎఫ్.7 వేరియంట్ కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇందులో రెండు కేసులను గుజరాత్లో గుర్తించారు.