China | చైనాతో యుద్ధమంటూ వస్తే గెలుపు భారత్ వైపే ఉంటుందన్న భారత ఆర్మీ చీఫ్ నరవాణే వ్యాఖ్యలపై చైనా స్పందించింది. భారత్లో ఓ బాధ్యతలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకుంటే బాగుంటుందని పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ బెన్బిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి బాధ్యత గల వ్యక్తులు మాట్లాడటం బాగోలేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆశిస్తున్నట్లు బెన్బిన్ పేర్కొన్నారు.
ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్ నరవాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సవ్యంగానే ఉన్నాయని, భారత్ , చైనా మధ్య చర్చలు కూడా నడుస్తున్నాయన్నారు. చర్చల ద్వారా పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకం మాత్రం తమకు ఉందని, అయితే తిరిగి పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయా? మారవా? అన్నది ప్రస్తుతానికి చెప్పలేమని వ్యాఖ్యానించారు. యుద్ధం అనేది చివరి ఆప్షన్ అవుతుందని, ఒక వేళ యుద్ధం జరిగినా, గెలుపు భారత్దే అవుతుందని నరవాణే ధీమా వ్యక్తం చేశారు.