న్యూఢిల్లీ: భారత్ తన వ్యూహాత్మక లక్ష్యాలను అందుకునే దారిలో.. చైనా సుదీర్ఘ సవాల్గా నిలుస్తోందని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరీ తెలిపారు. చైనా తన వైమానిక దళ మౌళికసదుపాయాలను పెంచుకుపోతున్న తీరు ఆధారంగా ఆ దేశ దూకుడును అర్థం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన సైనిక సత్తాను పెంచుకుందన్నారు. భారత వైమానిక దళం కూడా వేగంగా ఆధునీకరణ చెందాలని, తన దళాలను మరింత విస్తరింపచేయాలని, స్వదేశీ తయారీ కేంద్రాల సామర్ధ్యాన్ని పెంచాలని ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో మనపై అన్ని రకాల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆర్థికమైన అంశాల నుంచి దౌత్యపరమైన అంశాలతో పాటు సైనిక దాడులు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. చైనా గుత్తాధిపత్యం, ట్రాప్ చేసే విధానాలు.. ఇండియాకు కొత్త అవకాశాలను కల్పిస్తాయన్నారు. దీంతో ఇండోపసిఫిక్ ప్రాంతంలో భారత వాణిజ్య, రక్షణ బంధాలు బలోపేతం అవుతాయన్నారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కొత్త ఆయుధాలను సేకరిస్తోందని, వైమానిక రక్షణ సామర్ధ్యాన్ని అప్గ్రేడ్ చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.