China : భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరిహద్దు వివాదాల్లో మూడోపక్షం జోక్యాన్ని ఏమాత్రం సహించమని చైనా తేల్చి చెప్పింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వూ కియాన్ మాట్లాడుతూ.. సరిహద్దు గొడవ భారత్, చైనా మధ్య జరుగుతున్న ఘర్షణ అని, మూడో పక్షం జోక్యాన్ని సహించమని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు గొడవలను తాము నిశితంగానే గమనిస్తున్నామని అమెరికా ఓ ప్రకటనలో పేర్కొంది.ఈ నేపథ్యంలోనే చైనా పై విధంగా స్పందించింది.
ఇక భారత్ కూడా ఇదే వైఖరితోనే వుందని వూ కియాన్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా అమెరికాను ఉద్దేశించి చేసినవే. బలవంతపు దౌత్యం అన్న శబ్దాన్ని అమెరికా ప్రయోగించడానికి మరీ తహతహలాడిపోతోందంటూ ఆయన ఎద్దేవా చేశారు. అందులో అమెరికా మాస్టర్ అని ఆయన విరుచుకుపడ్డారు. అమెరికా చేస్తోన్న ఈ బలవంతపు దౌత్యాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భారత్, చైనా మధ్య జరిగిన 14 వ రౌండ్ సమావేశాలు అత్యంత సానుకూలంగా, నిర్ణయాత్మకంగానే జరిగాయని వూ కియాన్ పునరుద్ఘాటించారు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని వూ కియాన్ తెలిపారు.