కోల్కతా : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీలే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం నిప్పులు చెరిగారు. ఈసీ రోజువారీ కార్యకలాపాల్లో అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు తనను చంపేందుకు కుట్ర పన్నారా అని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంకురాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈసీ సమక్షంలో తన సెక్యూరిటీ డైరెక్టర్ను మార్చారని విమర్శించారు. ‘బీజేపీ నన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నిందా..? వారు (ఈసీ) నా భద్రతా సంచాలకుడిని మార్చివేశార’ని దీదీ నిలదీశారు.
ఈసీ పనితీరులో అమిత్ షా జోక్యంపై ఆమె మండిపడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోందా అని ప్రశ్నించారు. దేశ హోంమంత్రే ఎవరిని అరెస్ట్ చేయాలి..ఎవరిని కొట్టాలి..ఏ దర్యాప్తు సంస్ధ ఎవరిని వెంబడించాలనేది నిర్ణయిస్తున్నారా..? ఎన్నికల సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు..? అని ప్రశ్నించారు. అమిత్ షా మీరైతే కాదని అనుకుంటున్నాము. తాము ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగాలని కోరుకుంటున్నామని దీదీ వ్యాఖ్యానించారు. ఈసీ రోజువారీ పనితీరులో అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నందిగ్రామ్లో గాయపడిన అనంరతం వీల్ఛైర్లో ప్రచారం చేస్తున్న మమతా బంకురా ర్యాలీలో దుర్గా మంత్రాన్ని పఠించారు. ఇక బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుండా మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.