న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో అక్రమంగా చైనా నిర్మించిన రెండవ గ్రామానికి చెందిన తాజా శాటిలైట్ దృశ్యాలను ఓ జాతీయ మీడియా రిలీజ్ చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 బిల్డింగ్లను నిర్మించినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టమవుతున్నది. 2019 శాటిలైట్ దృశ్యాల్లో లేని ఆ గ్రామం.. ఏడాది తర్వాత తీసిన చిత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల అరుణాచల్లో ఓ గ్రామం నిర్మించిన చైనా.. దానికి 93 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ప్రాంతాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇంటర్నేషన్ బోర్డర్ మధ్య ఉన్న భారత భూభాగంలో సెకండ్ ఎన్క్లేవ్ను నిర్మించినట్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతం తమదే అని భారత్ గతంలో పేర్కొన్నది. అయితే కొత్తగా నిర్మించిన ఆ బిల్డింగ్ల్లో ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియరావడం లేదు. భారతీయ ఆర్మీ దీనిపై స్పందిస్తూ .. కొత్త నిర్మాణం ఎల్ఏసీకి ఉత్తరం వైపున ఉన్నట్లు పేర్కొన్నది. అరుణాచల్ ప్రదేశ్లోని షి యోమి జిల్లాలో ఉన్న భూభాగంలో ఈ ప్రాంతం ఉన్నట్లు తెలుస్తోంది.