Aksai Chin | న్యూఢిల్లీ, ఆగస్టు 30: సరిహద్దులో చైనా ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. భారత్తో పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతున్నది. ఉత్తర లఢక్లోని సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా మిలటరీ పెద్ద ఎత్తున బంకర్లు, సొరంగాలు, రోడ్లు నిర్మిస్తున్నట్టు అమెరికా స్పేస్ టెక్నాలజీ కంపెనీ ‘మాక్సర్’ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఆయుధాల్ని నిల్వచేసేందుకు, బలగాలను వేగంగా తరలించేందుకు భారీ స్థాయిలో నిర్మాణాలు సాగుతున్నాయని తెలిపే ఆగస్టు 18న శాటిలైట్ తీసిన ఫొటోలు బయటకొచ్చాయి. సొరంగాల ప్రవేశమార్గం వద్ద భారీ యంత్రాలు, నిర్మాణ సామాగ్రి ఉండటం ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది. వివాదాస్పద ప్రాంతం అక్సాయ్చిన్లో ఈ నిర్మాణాలు ఉండటం భారత్ను అత్యంత కలవరపరిచే అంశంగా అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1962 యుద్ధం తర్వాత ఈ ప్రాంతం హక్కులపై భారత్-చైనా మధ్య వివాదం నెలకొన్నది. డిసెంబర్ 6, 2021-ఆగస్టు 18, 2023 మధ్య మొత్తం ఆరు ప్రాంతాల్లో సొరంగాలు, బంకర్ల నిర్మాణం జరిగినట్టు తెలుస్తున్నది.
లఢక్ ఘర్షణతో మొదలు
లఢక్కు సమీపంలో భారత్-చైనా బలగాల మధ్య మే 2020లో ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణ తర్వాత సరిహద్దులో భారత్కు వ్యతిరేకంగా చైనా సరికొత్త వ్యూహాలను రచిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్సాయ్చిన్లో భారత వాయుసేనకు ఉన్న సానుకూలతలు, ఒకవేళ దాడులకు దిగితే ఎదుర్కొనేందుకు చైనా ఈ ప్రాంతంలో వ్యూహాలు రచిస్తున్నదని, దాంట్లో భాగంగానే ఈ నిర్మాణాలు చేపట్టిందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవాధీన రేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలో గత కొన్ని నెలలుగా ఈ నిర్మాణాల్ని చైనా చేపట్టినట్టు తెలుస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్ ప్రాంతాల్ని చేర్చుతూ ‘స్టాండర్డ్ మ్యాప్’ను చైనా విడుదల చేసిన మరుసటి రోజే, ఉత్తర లఢక్లో చైనా నిర్మాణాల శాటిలైట్ ఫొటోలు విడుదల కావటం చర్చనీయాంశమైంది. ‘లఢక్లో చైనా మిలటరీ మోహరింపులు పెరిగాయి. బంకర్లలో వసతుల కల్పనపై దృష్టిసారించారు. ఇదంతా కూడా ఈ ప్రాంతంలో చైనా మిలటరీ బలాన్ని పెంచేవే. లఢక్లో భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకే ఇదంతా’ అని మిలటరీ ఎనలిస్ట్ సిమ్ టాక్ అన్నారు.