న్యూఢిల్లీ: పాన్గాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ బ్రిడ్జ్కు సంబంధించిన కొత్త శాటిలైట్ ఫోటోలు రిలీజ్ అయ్యాయి. బ్రిడ్జ్ సుమారు 400 మీటర్ల పొడుగు ఉంది. ఒకవేళ ఈ బ్రిడ్జ్ పూర్తి అయితే, ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యం, పట్టు పెరుగుతుంది. రెండేళ్ల క్రితం ఈస్ట్రన్ లడాఖ్లో భారత, చైనా బలగాల మధ్య ఘర్షణ తర్వాత.. పాన్గాంగ్ సరస్సు కీలక ప్రదేశంగా మారింది. బ్రిడ్జ్ సుమారు 8 మీటర్ల వెడల్పు ఉన్నది. పాన్గాంగ్ నార్త్ బ్యాంక్పై ఉన్న చైనా ఆర్మీ బేస్కు సమీపంలో ఈ కొత్త బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. శీతాకాలంలోగానే బ్రిడ్జ్ను కట్టేయాలన్న కసితో చైనా పనులు చేపడుతోంది. శాటిలైట్ చిత్రాల్లో ఆ ప్రాంతంలో భారీ క్రేన్లు కనిపిస్తున్నాయి. జనవరి 16వ తేదీన తీసిన ఉపగ్రహ చిత్రాలు ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. బ్రిడ్జ్ పిల్లర్లు, కాంక్రీట్ శ్లాబ్లను కలిపేందుకు భారీ క్రేన్లను వాడుతున్నట్లు ఆ శాటిలైట్ చిత్రాల్లో తెలుస్తోంది. మరికొన్ని నెలల్లోనే ఆ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసే రీతిలో వేగంగా పనులు కానిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ వల్ల చైనా ఆర్మీ ఉండే రుతాంగ్ ప్రాంతానికి దూరం తగ్గుతుంది. పాన్గాంగ్ సరస్సు వద్ద వేగంగా సైనికుల్ని తరలించేందుకు కూడా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనున్నది. దాదాపు 150 కిలోమీటర్ల దూరం తగ్గనున్నది. అయితే 60 ఏళ్లుగా చైనా ఆధీనంలో ఉన్న వివాదాస్పద ప్రాంతంలో బ్రిడ్జ్ను నిర్మిస్తున్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది.