కాన్పూర్, అక్టోబర్ 1: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో 27 మంది మృతిచెందారు. మరణించిన వారిలో 11 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మరో 25 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ట్రక్కులో 50 మందికి పైగా భక్తులు ఉన్నారు. ఉన్నావో జిల్లాలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తిరుగు క్రమంలో కాన్పూర్ జిల్లా ఘటంపూర్ ఏరియాలోకి వచ్చేసరికి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. అనంతరం రహదారి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.