న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అయిదేళ్ల లోపు చిన్నారులు మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక 18 లోపు వాళ్లకు తీవ్రమైన కోవిడ్ వచ్చినా.. వారికి యాంటీవైరల్స్ కానీ మోనోక్లోనల్ యాంటీబాడీలను కూడా ఇవ్వకూడదని మార్గదర్శకాల్లో వెల్లడించారు. ఒకవేళ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకు స్టిరాయిడ్స్ ఇస్తే, కేవలం 10 నుంచి 14 రోజుల లోపు మాత్రమే ఇవ్వాలన్నట్లు సూచించారు. 6 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు వాళ్ల సామర్ధ్యాన్ని బట్టి మాస్క్లు వాడాలని పేర్కొన్నది. అయితే తల్లితండ్రుల పర్యవేక్షణలో ఇది జరగాలన్నట్లు కేంద్రం చెప్పింది. ఇక 12 ఏళ్లు దాటిన వారు.. వయోజనుల తరహాలో మాస్క్లు ధరించాలని సూచించింది.
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఈ తాజా సూచనలు చేసింది.
కోవిడ్19 అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇక సీరియస్ కాని ఇన్ఫెక్షన్లో యాంటీబైక్రోబియల్స్తో పనిలేదని మార్గదర్శకాల్లో తెలిపారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న కేసుల్లో.. యాంటీమైక్రోబియల్స్ వాడవద్దు అన్నారు. ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంటేనే యాంటీమైక్రోబియల్స్ వాడాలని ఆరోగ్యశాఖ తెలిపింది. లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు.. స్టిరాయిడ్స్ వాడితే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. డెక్సామీథసోన్, మిథైల్ప్రెడ్నిసోలోన్ లాంటి కార్టికోస్టిరాయిడ్స్ మాత్రం తీవ్రమైన లక్షణాలు ఉన్న కేసుల్లో వాడాలన్నట్లు సూచించింది. లక్షణాలు కనిపించిన 5 రోజుల తర్వాతే స్టిరాయిడ్స్ వాడాలన్నట్లు తెలిపింది.