Snake Bite | చెన్నై : ఓ 18 నెలల చిన్నారి పాము కాటుకు బలైంది. అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో, సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేదు. దీంతో చిన్నారి మృతి చెందినట్లు ఆ పాప తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వేలూరు జిల్లాకు చెందిన ఓ 18 నెలల అమ్మాయి పాము కాటుకు గురైంది. అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారి ధనుష్కను వేలూరులోని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ను ఆశ్రయించారు. అంబులెన్స్ కొంత దూరం వెళ్లిన తర్వాత.. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో.. ఆ వాహనం ముందుకు కదల్లేకపోయింది. దీంతో తల్లే తన భుజాలపై కూతుర్ని ఆరు కిలోమీటర్ల మేర మోసుకెళ్లింది. ఈ క్రమంలో మార్గమధ్యలోనే ధనుష్క ప్రాణాలు కోల్పోయింది. సరైన రోడ్డుమార్గం లేకపోవడం వల్లే తమ పాప ప్రాణాలు కోల్పోయిందని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై వేలూరు జిల్లా కలెక్టర్ స్పందించారు. ధనుష్క తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆశా వర్కర్ను సంప్రదిస్తే, ప్రథమ చికిత్స చేసేవారు. దాంతో పాప ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉండేదన్నారు. కానీ తల్లిదండ్రులు ఆశా వర్కర్ను సంప్రదించలేదని తెలిపారు. ఇక ఈ మార్గంలో రోడ్డు పనులకు ఆమోదం లభించిందని, నిధులు కూడా మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.