దేశం ముందున్న ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడమే తన ప్రథమ లక్ష్యమని భారత ఆర్మీ నూతన చీఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు. అలాగే రాబోయే సవాళ్లపై దృష్టి సారించడం కూడా తన కార్యాచరణలో భాగమేనని తెలిపారు.
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం సౌత్బ్లాక్లో గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇతర దళాల అధిపతులతో కూడా తనకు సన్నిహిత సంబంధాలే వున్నాయని పేర్కొన్నారు. త్రివిధ దళాలు కూడా కలిసి కట్టుగా విధులు నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు.
దేశ భద్రత విషయంలో మాత్రం కలిసి కట్టుగానే ముందుకు సాగుతామని జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. అయితే భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని, తమ ముందు సవాళ్లు కూడా అంతే స్థాయిలో వున్నాయని ఆయన పేర్కొన్నారు.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎంత వేగంగా మార్పు చెందినా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని, త్రివిధ దళాలు ఈ విషయంలో సమన్వయంతో ముందుకు సాగుతామని జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు.
భారత ఆర్మీని ముందుండి నడిపించడం తనకెంతో గర్వంగా వుందని ఆనందం వ్యక్తం చేశారు. దేశం కోసం ఆర్మీ ఎంతో చేసిందని, భారత ఆర్మీకి ఘనమైన చరిత్ర వుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలోనూ ఆర్మీ పాత్ర మరిచిపోలేనిదని ప్రకటించారు.
ఆర్మీలో సంస్కరణలు, కార్యాచరణ, క్రియాత్మక సామర్ధ్యాన్ని పెంచడంపై పూర్తి దృష్టి నిలుపుతానని మనోజ్ పాండే ప్రకటించారు. ఇంటర్ సర్వీస్ సహకారాన్ని పెంపొందించడంపై కూడా దృష్టి నిలుపుతానని జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు.