హైదరాబాద్, మార్చి 16 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘మద్యం పాలసీ’ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఈ కేసు విషయమై ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. ‘మద్యం పాలసీ’ కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శనివారం ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టుకు స్వయంగా కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ కేసు విషయమై ఈడీ విచారణకు గైర్వాజరవ్వడానికి గల కారణాలను న్యాయమూర్తి దివ్య మల్హోత్రకు తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించారు. కేజ్రీవాల్పై ఈడీ మోపిన అభియోగాలు బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని అభిప్రాయపడ్డ కోర్టు.. రూ.15,000 బాండ్, రూ.లక్ష పూచీకత్తుతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
మద్యం పాలసీ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ కేజ్రీవాల్కు ఇప్పటివరకూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే వాటిని ఆయన తిరస్కరించారు. దీంతో కేజ్రీవాల్పై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. అప్పుడు విచారణ జరిపిన ధర్మాసనం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన వర్చువల్గా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ అంశం కోర్టులో పెండింగ్లో ఉండగానే కేజ్రీవాల్కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది.
చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. సీఎం గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించింది. కవిత అరెస్టుతో స్వయంగా హాజరవ్వాలని కేజ్రీవాల్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈడీ అభియోగాలపై విచారించిన కోర్టు.. అవి బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని పేర్కొంటూ కేజ్రీవాల్కు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.