న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కేసును ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. 25 వేల మంది ఉద్యోగులను తొలగించాలంటూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ బెంగాల్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. ఆ కేసును సీజేఐ చంద్రచూడ్(CJI DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. టీచర్ల నియామక ప్రక్రియను తప్పుపడుతూ కోర్టులో కేసు ఉండగా ఎందుకు అదనంగా సూపర్న్యూమెరరీ పోస్టులను సృష్టించారని, వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు రిక్రూట్ చేశారని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు.
ఉద్యోగాలను రద్దు చేసే అధికారం హైకోర్టుకు లేదని సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదించారు. ఆ సమయంలో సీజేఐ కొన్ని ప్రశ్నలు వేశారు. రిక్రూట్మెంట్ అభ్యర్థులకు చెందిన ఓఎంఆర్ సీట్లు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. సున్నితమైన ఈ అంశంలో టెండర్ ఎందుకు జారీ చేయలేదని అడిగారు. డిజిటల్ కాపీలను దాచి పెట్టడం కమీషన్ బాధ్యత అని సీజే తెలిపారు.
పరీక్షలకు చెందిన డిజిటల్ డేటా సీబీఐకి కూడా దొరకలేదన్నారు. టీచర్ల నియామకంలో వ్యవస్థీకృత నేరం జరిగిందని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ అని, ఇక వాళ్ల అపాయింట్మెంట్ను కూడా మలినం చేస్తే వ్యవస్థ ఎలా నడుస్తుందని సీజే ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతోందన్నారు.