న్యూఢిల్లీ : తమిళనాడులో బలవంతపు మత మార్పిడిపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం తోసిపుచ్చారు. రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చిదంబరం సోమవారం విలేకరులతో మాట్లాడారు. తాను ఒకటో తరగతి నుంచి కాలేజ్ వరకూ క్రైస్తవ విద్యా సంస్ధల్లో చదివానని, కాషాయ పార్టీ చేస్తున్న బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు హేయం, అసత్యాలని స్పష్టం చేశారు.
తమిళనాడులోని తంజావూరు క్రైస్తవ పాఠశాలలో బాలిక మృతి నేపధ్యంలో బీజేపీ తమిళనాడు శాఖ ఈ ఆరోపణలను ముందుకు తెచ్చింది. తమిళనాడులో బలవంతపు మతమార్పిడి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆరోపించారు. కన్యాకుమారిలోని కన్నతువిలైలోని ప్రభుత్వ పాఠశాల బాలిక ఏప్రిల్లో ఇచ్చిన ఫిర్యాదే ఇందుకు తాజా ఉదాహరణని అన్నారు. అయితే ఈ ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చుతూ వేలాది మంది విద్యార్ధులు ఎప్పటినుంచో క్రైస్తవ పాఠశాలల్లో చదువుకుని జీవితంలో పైకి ఎదిగారని ఏ ఒక్కరూ మతమార్పిడికి ప్రయత్నించలేదని అన్నారు.
ఇవి ముమ్మాటికీ తప్పుడు ఆరోపణలని వ్యాఖ్యానించారు. కార్తీ చిదంబరంపై సీబీఐ దాడులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రతిబింబిస్తానని, అందుకే కాంగ్రెస్ విధానాలను చూసి వారు భయపడుతున్నారని కాషాయ పాలకులపై మండిపడ్డారు. ఇక ప్రధాని మోదీ ఎదుట స్టాలిన్ ప్రసంగం తీరుపై బీజేపీ విమర్శలను ప్రస్తావిస్తూ ప్రధాని తమ ప్రభుత్వ పధకాల గురించి మాట్లాడితే సీఎం రాష్ట్ర పధకాల అమలుకు నిధులు కోరారని ఇద్దరి వాదన సరైనదేనని, ఇందులో ఒకరిది తప్పు మరొకరిది ఒప్పు అని చెప్పలేమని చిదంబరం వ్యాఖ్యానించారు.